మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు
పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు బుక్స్, యూనిఫామ్స్, షూస్
రజక, నాయి బ్రాహ్మణ కులవృత్తుల ఉచిత విద్యుత్ బిల్లుల విడుదల
సమీక్షా సమావేశంలో ఉప ఉఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్: మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టిసి లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. ప్రతి మూడు నెలలకు కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ప్రజాభవన్ లో ఆర్టిసి, బిసి సంక్షేమ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టిసి ఎండి నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజెపి కార్యదర్శి సైదులు, బిసి సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్టిసి బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని అన్నారు.
ముఖ్యంగా ఆడబిడ్డలకు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టిసి లభాల్లోకి వచ్చిందన్నారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం అందించిన సహాకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ప్రభుత్వ సహకారంతో సంస్థ నూతనంగా ఆదాయా మార్గాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆర్టిసిలో మహాలక్ష్మీ పధకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగాయని, ఈ పథకం వల్ల మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిసిలో పిఎఫ్ బకాయిలు రూ. 1400 కోట్లు ఉంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ. 660 కోట్లకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. సిసిఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ప్రజాప్రభుత్వం రూ.373 కోట్లకు తగ్గించిందన్నారు.
మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు
ఆర్టిసిలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు ఆయన సూచించారు. ఆర్టిసిలో పిఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వీటికి చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు.
పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు
ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ పంపిణీ చేయాలని అందుకు సంబధించిన నిధులు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ను ఆదేశించారు. నాయి బ్రాహ్మణ, రజకకుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు లేకుండా నెల వారిగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోందని, అందులో భాగంగా ఒకేసారి వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసిందని చెప్పారు. గతంలో ఎంజెపిలో 327 గురుకులాల్లో కేవలం 26 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వం వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు కార్పొరేట్ తరహాలో భవనాలను నిర్మిస్తోందన్నారు. గురుకులాల స్కూల్ అద్దె, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశారని తెలిపారు. గీత వృత్తిదారుల రక్షణకు ఇప్పటి వరకు 30 వేల కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. మార్చ్ 2026 వరకు 3,233 కండక్టర్ పోస్టులు అవసరం ఉండగా తాత్కాలికంగా నియామకాలు జరపడంతో పాటు 50 శాతం రెగ్యులర్ నియామకాలకు అనుమతివ్వాలని కోరారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు, డ్రైవింగ్ లైసెన్స్ ల జారిలో ఉన్న ఇబ్బందులు తేలెత్తకుండా యూజర్ ఛార్జీలకు అనుమతివ్వాలని, రవాణా శాఖ లో ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి కొత్త వాహనాలకు అనుమతివ్వాలని ,టాక్స్ కలెక్షన్ కోసం ట్యాబ్ లు మంజూరు చేయాలని మంత్రి డిప్యూటీ సిఎంను కోరారు.