శేరిలింగంపల్లి పరిస్థితి పైన పటారం, లోన లోటారం: కవిత
మియాపూర్: బిజెపి నాయకులకు వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని, ప్రజలకు ముఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, చట్టం, న్యాయం మీద తమకు నమ్మకం ఉందని, కచ్చితంగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, అందులో నంబర్ వన్ బాధితురాలిని తానేనని, ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని తెలియజేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మియాపూర్ లోని పిఎ నగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ప్రసంగించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే రిచ్ నియోజకవర్గం అంటారని, పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు, ధనవంతులు ఇక్కడ ఉన్నారని, అదే సమయంలో దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు, పేద బస్తీలు ఉన్నాయని, వాటిని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితి పైన పటారం, లోన లోటారం అన్న చందంగా ఉందని, ఇక్కడి స్మశానం నుంచి పాములు ఇళ్లల్లోనికి వస్తున్నాయని, చెత్త తీసుకెళ్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. బస్తీ వాసులకు జాగృతి అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పనిచేస్తామని కవిత హామీ ఇచ్చారు.
ఫ్రీ కరెంట్, గ్యాస్, మహిళలకు రూ. 2500, ఆరు గ్యారంటీలు అని హామీలు ఇచ్చారని, కానీ వాటిని పట్టించుకోవటం లేదని, వాటిని అమలు చేయటం కాంగ్రెస్ నాయకుల వల్ల కాదు అని మండిపడ్డారు. కనీసం ఈ బస్తీలో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, స్థానికులు వెళ్లి అడిగితే మున్సిపల్ అధికారులు లీడర్లు చెప్పాలని అంటున్నారని, మున్సిపల్ అధికారులు బస్తీ వాసులకు కనీస పనులు చేయకపోతే ఎట్ల? అని అడిగారు. ప్రజలను మభ్య పెట్టటం మానేసి వారికి మంచి చేసే పని చేయాలని కవిత చురకలంటించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు.