బస్సు ఛార్జీల పెంపు క్షమించరానిది: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టిసి ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సామాన్యులపై భారం వేసేందుకు రెడీ అయింది. హైదరాబాద్లో ఆర్టిసి బస్సుల టికెట్ ధరలు భారీగా పెంచేసింది. ఇప్పటికే బస్ పాస్, టి-24 టికెట్ ధరలను పెంచిన ప్రభుత్వం.. తాజాగా నగరంలో టికెట్ ధరలను కూడా పెంచింది. మొదటి 3 స్టేజీలక రూ.5, ఆ తర్వాత నుంచి రూ.10కి పెంచారు. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ‘‘సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.
ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతంటిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనం. రాజధాని వాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిది’’ అని కెటిఆర్ పోస్ట్ చేశారు.