అమరావతి: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఉందని తెలిపారు. సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచారని, సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారని, మానవులను ప్రేమించాలని ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అందరిలో కనిపిస్తోందని, ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని, జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారని కొనియాడారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారని, తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు.
మానవ సేవ మాధవ సేవ బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారని, ఈనాడు 140 దేశాల్లో బాబా భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని, సాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రకటించారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.