దేవరగట్టులో చెలరేగిన హింస: ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో హింస చెలరేగింది. మాళ్ల మల్లేశ్వర స్వామి బన్ని జైత్రయాత్రలో ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. అల్లర్లు శృతి మించడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గత అర్థరాత్రి అమ్మవారి శోభాయాత్ర జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లేందుకు ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కర్రలతో దాడులు చేసుకోవడంతో ఇద్దరు దుర్మరణం చెందగా వంద మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. కర్రలతో కొట్టుకోవడం శృతిమించడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కర్రల సమరంలో ఎలాంటి హింస జరగకుండా ఆపేందుకు పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలు, అధికారులు వేసిన ప్రణాళికలు ఫలించలేదు.
దసరా సందర్భంగా కర్రల దేవరగట్టు ప్రజలు కర్రల సమరాన్ని దశబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏటా జరిపే ఈ ఉత్సవం ఆనవాయితీగా వస్తోంది. దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎప్పటిలాగే దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా దేవతా మూర్తుల విగ్రహాలను దక్కించుకోవడమే లక్ష్యంగా 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగుతారు.