మేం తిరగబడితే రాష్ట్రం ఆగమే..
మన తెలంగాణ/నూతనకల్ : పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది, మేము తిరగబడితే తట్టుకోలేరు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధికార పార్టీకి ఘాటుగా హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమ పార్టీ ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే..
అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే ఆ పార్టీ శ్రేణులు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ‘పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు. మేం కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?’ అ ని ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాం గ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మా ని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగితే, ఇక సహించేది లేదని, తాము కూడా తిరగబడక తప్పదని వ్యాఖ్యానించారు. అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంసృ్కతి గతంలో లేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు.
మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం..
మల్లయ్య చనిపోయిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఆగానని తెలిపారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తప్పకుండా మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
బిఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు
కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు కెటిఆర్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కెసిఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మం త్రి, సూర్యాపేట ఎంఎల్ఎ జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, నేతలు భూపాల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.