పీడిత వర్గాలకేదీ చేయూత?
‘ఓటు హమారా -రాజ్తుమారా, నహీ చలేగా.. నహీచలేగా’ (ఓట్లు మావి -రాజ్యం మీది, ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు), జిస్కి జితినీ సంఖ్యా భారి, ఉన్కి ఉత్ని ఇస్సేదారి (ఎవరెంతో, వారికంతా) వంటి నినాదాలతో దేశరాజకీయాల్లో ప్రకంపలను సృష్టించిన వీరుడు కాన్షీరాం. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అటు దేశంలో, ఇటు రాష్ట్రాల్లోనూ అగ్రకుల ఆధిపత్య రైటిస్ట్, లెఫ్టిస్ట్ పార్టీలే అధికారంలో ఉండేవి. 1975 ఎమర్జెన్సీ తరువాత కూడా ఆ పార్టీలే అధికారంలోకి రావడం గమనార్హం. వీటికి అభిముఖంగా కాన్షీరాం బహుజన ఉద్యమం బయలుదేరింది. ములాయంసింగ్ యాదవ్ 1992 ముందు జనతాదళ్ (సోషలిస్ట్) నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాన్షీరాం ఆ పార్టీనుంచి బయటికి రప్పించి ఆయనతో సొంతగా బిసిల రాజకీయ పార్టీనీ పెట్టించాడు. 1993లో ఆ పార్టీ పొత్తుతో యుపిలో బహుజన రాజ్యాధికారం చేజిక్కిచ్చుకున్నాడు. ఇది ఆనాటి సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కాన్షీరాం సృష్టించిన రాజకీయ ప్రకంపనలు. డిఆర్డిఒ లో శాస్త్రవేత్తగా జీవితాన్ని ఆరంభించిన కాన్షీరాం 31వ ఏట అంబేద్కర్ రాసిన ‘కులనిర్మూలన’ గ్రంథం చదివి ప్రేరేపితుడయ్యాడు.
ఈ దేశంలో అట్టడుగు వర్గాల విముక్తికి ఉద్యమాలు సాగించిన ఫూలే, సాహుమహరాజ్, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్లకు ప్రతిరూపంగా నిలిచాడు. బహుజన కులాలను ఏకంచేసేందుకు బామ్ సేఫ్, డిఎస్-4 వంటి సంస్థలను ఏర్పాటు చేసి సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్య భేరి మోగించాడు. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీని స్థాపించాడు. ఇదీ 1996 నాటికి జాతీయ పార్టీగా ఎదిగి బహుజన రాజ్యానికి దిక్సూచిగా నిలిచింది. కాన్షీరాం మన నుంచి దూరమై రెండు దశాబ్దాలు కావస్తున్నా ఆయన స్వరాజ్య, సామాజిక న్యాయపోరాటం కొనసాగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల కులగణన, రిజర్వేషన్లు పెంపు వంటి సామాజిక న్యాయ డిమాండ్లు ఇందుకు నిదర్శనం. కానీ అగ్రకుల రాజకీయ నీడలో అని విఫలమవుతున్నాయి. కాన్షీరాం కులాన్ని రాజకీయ అస్త్రంగా వాడిన రాజనీతిజ్ఞుడు. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేమని’ ఆనాడు అంబేద్కర్ పేర్కొన్నారు. ఆయన ఆధిపత్య కులపునాదుల మీద జాతీయవాదాన్ని నిర్మించాలన్న అగ్రకులాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశాడు. దీనిలోని తాత్వికతను అర్థం చేసుకున్న కాన్షీరాం ‘కులాన్ని రెండంచుల కత్తి’గా పేర్కొంటూ కులాల కేంద్రంగా రాజ్యాధికారాన్ని సాధించాడు. మినీ ఇండియా లాంటి ఉత్తరప్రదేశ్కు ఒక దళిత మహిళ అయిన మాయావతిని నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాడు. ఆమె హయాంలో ప్రజల సామాజిక, ఆర్ధిక స్వావలంబనకు పునాది పడ్డది.
అట్టడుగువర్గాల చేతిలో ఆధికారమే ఇలాంటి మార్పులకు కారణమైనది. కాన్షీరాం బహుజనోద్యమం పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, కశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రభావం చూపింది. ఆయన రాజకీయ చైతన్య పోరాటం బిసి వర్గాలలో రాజకీయ కాంక్షను రగిలించింది. ఆ వర్గాలలో నుంచీ యుపిలో ములాయం సింగ్ యాదవ్, బీహార్లో లాలూప్రసాద్ యాదవ్, రామ్విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్ మొదలైనవారు తమ సొంత రాజకీయ పార్టీలతో శాసించగలిగారు. దక్షిణాన తమిళనాట ఆత్మగౌరవ రాజకీయాలు ఇందుకు నిదర్శనమే. రాజకీయాల్లో సరికొత్త నినాదానికి తెరలేపిన కాన్షీరాం బాట నేటికీ మరువలేనిది. ఒక ఓటు- ఒక నోటు నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం -బహుజన రాజ్యాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా తనదైన శైలిలో రాజకీయ ఉద్యమం సాగించాడు. నువ్వు 85% ఉండగా, 15%మీద ఎందుకు ఆధారపడతావు అని ప్రశ్నించాడు. నీ కాళ్లమీద నీవే పార్లమెంటు, అసెంబ్లీకి నడువు అంటూ ఎస్సి, ఎస్టి, బిసిలకు స్వాభిమానన్నీ నేర్పినయోధుడు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అంటూ అగ్రకుల పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఆనాడు మండల్ కమిషన్ (1980) ఒబిసిలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై ఢిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల ధర్నా చేశాడు. కాన్షీరాం బీసీ రిజర్వేషన్ ఉద్యమం విప్లవానికి కారణమైనది. ‘విప్లవం అంటే రేషన్కార్డు, పెన్షన్కోసం వంటి సంక్షేమ పథకాల కోసం ఉద్యమాలు, ధర్నాలు చేయడంకాదు. వేల సంవత్సరాలనుంచి దోపిడీ చేస్తున్న అగ్రకులాలు మాకు న్యాయం కావాలని రోడ్లపైకి రావడమే విప్లవం. ఇదీ భారతదేశ చరిత్రలో రెండు సందర్భాల్లో జరిగింది. మొదటిది రాజ్యాంగం అమలైన తరువాత, అగ్రకులాలు అదనపు హక్కులు కోల్పోతున్నామని ఎన్.డి తివారి నాయకత్వంలో వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాజ్యాంగాన్ని కాల్చి ధర్నా చేశారు. రెండోది 1990లో మండల్ కమిషన్కు వ్యతిరేకంగా రోడ్లపైన ధర్నా చేస్తూ న్యాయాన్ని అభ్యర్థించారు. ఇలాంటి అనివార్యతను సృష్టించిన అధినాయకుడు కాన్షీరాం. ఇప్పుడు మనం కూడా ఆ సందర్భాలు సృష్టించడమే విప్లవం’. కాన్షీరాం యుపి తర్వాత ఎపిలో రాజ్యాధికారం కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఇక్కడ అగ్రకుల నీడలో నడిచిన బిసి, ఎస్సి, ఎస్టి ప్రజలు ఆయనకు సహకరించలేదు.
ఇప్పుడు తెలంగాణలో కాన్షీరాం ఉద్యమానికి కొనసాగింపుగా బిసి, ఎస్సి, ఎస్టిల ఐక్యకార్యాచరణ సమితి (జాక్) ఆవిర్భవించింది. ఇది రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహరాజ్, ఉమ్మడి ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రొ. నాగం కుమారస్వామి, ప్రొ. రామయ్య షెఫర్డ్ మొదలైన వారి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఈ జాక్ సారథ్యంలో లక్ష కిలోమీటర్ రథయాత్ర సాగుతున్నది. ఇది తెలంగాణలో మూడున్నర కోట్ల పీడిత ప్రజల విముక్తి కోసం సాగే మహా ప్రయాణం. ఇప్పుడు వీరంతా సంఘటితమై, భారత రాజ్యాంగ బలంతో రాజ్యాధికారం వైపునడవాలి. అప్పుడే సామాజిక న్యాయం సాకారమవుతుంది.
సంపతి రమేష్ మహారాజ్, 7989579428
