జోడేఘాట్ సాయుధ యోధుడు
(నేడు రౌట కొండల్ జయంతి)
నేటి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్లోని రౌట సంకేపల్లి గ్రామంలో పుట్టిన రౌట కొండల్ కుమురంభీం చిన్ననాటి స్నేహితుడు. కుమ్రంభీమ్ తండ్రి చిన్ను ఆ గ్రామాన్ని స్థాపించాడు. చిన్నప్పటి నుంచి కలసిమెలసి ఉండే ప్రాణ స్నేహితులు వీరు. తమ మేనమామలు పాడిన గోండ్ రాజుల వీరోచిత గాథలను వింటూ ప్రేరణ పొందేవారు. ఒకప్పుడు స్వతంత్ర రాజులుగా ఉన్న గోండులు ఇప్పుడు కటిక పేదరికంలో ఉండటమేమిటి అని యువకుల మనసులకు అర్థం కాలేదు. ఓ సందర్భంలో… మీ కళ్ల ముందు జరుగుతున్న దారుణాలను ఇప్పుడు విశ్లేషించి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పెద్దలు గోండీ భాషలో చెప్పినారు. ఇది అక్కడి యువజనులకు స్ఫూర్తినిచ్చింది. నిజాం అధికారుల దౌర్జన్యాలను తట్టుకోలేక గోండులు, స్వజాతి తెగలవారు వలసబాటపట్టారు. ఆ పరిస్థితిని ఎలాగైనా ఎదుర్కోవాలని భీమ్, కొండల్ భావించేవారు.
పోలీసు బలగాలు, అధికారులకు మద్దతుగా, వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. కాబట్టి భీమ్ సైన్యం పోలీసులను వారి తుపాకులను ఎదుర్కోవటానికి మార్గాలను ఆలోచించింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులను ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. భీమ్, అతని అనుచరులు కూడా బర్మర్ తుపాకులు, వాటి మందుగుండు సామగ్రి తయారీని నేర్చుకున్నారు. ఈ ప్రయత్నాలతో, కొండల్ మంత్రవిద్య శక్తులకు, భీమ్ భౌతిక పరాక్రమానికి మారుపేరైనారు. వారి శక్తియుక్తులు, విశ్వాసాలపై నమ్మకంతో 12 కుగ్రామాల నుండి వందలాదిగా యువకులు తమ ప్రైవేట్ దళంలోకి లాగబడ్డారు. తద్వారా భూస్వాములు, జంగ్లాతు అధికారులు, పోలీసు బలగాలను ఎదిరించారు. తమ పూర్వపు సంప్రదాయ జీవన విధానాలకు పదును పెట్టాలని ఆలోచించారు. ఈలోగా నిజాం అధికారుల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. భీమ్, మరికొందరు వాటిని భరించలేక సమీపంలోని సుర్గాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గిరిజనుల పంటలు కోతకు సిద్ధమైన తర్వాత సిద్దిక్ అనే భూస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు వాటిని దోచుకున్నారు. కుమ్రం భీమ్ వాటిని ఎదుర్కొన్నాడు. తదనంతర పోరాటంలో భీమ్ ఒక దారితప్పిన దుంగతో సిద్దిక్ తలపై కొట్టాడు. సిద్దిఖ్ కింద పడిపోయాడు. సిద్దిఖ్ చనిపోతే తీవ్ర పరిణామాలు ఏర్పడవచ్చని భీమ్ పారిపోయాడు.
మహారాష్ట్ర మీదుగా అస్సాంకు పోయిన భీమ్ తేయాకు తోటలలో పనిచేశాడు. 1930 36 లలో బ్రిటీష్ దురాగతాలు తమ ప్రాంతాలలో ఎలా జరుగుతున్నాయో తెలుసుకుని బాబేఝరి జోడేఘాట్ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. భీమ్ తండ్రి సోదరులు, కొండల్ ఆదివాసీలతో కలిసి బాబేఝరి నుండి జోడేఘాట్ వరకు గుట్టల వెంబడి పన్నెండు కుగ్రామాలను స్థాపించారు. ప్రభుత్వ అధికారులు దాడికి వచ్చినప్పుడు, గోండు వీరులు తమ దుస్తులను బాబేఝరి- జోడేఘాట్ లోయ ఒడ్డున చెట్ల మధ్య వేలాడదీసి, అధికారులను అటువైపు ఆకర్షించి, వెనుక నుండి గెరిల్లా యుద్ధంలో గాయపరిచారు. తిరుగుబాటు చేసిన గోండులను, ఇతర గిరిజన వీరులను పట్టుకునే మార్గాలు తెలియకుండానే నిజాం ప్రభుత్వ దళాలు భీమ్-కొండల్, వారి బదనిక తంత్రం ఆచూకీ తెలిసిన గోండును కనుగొన్నాయి.
భీమ్, కొండల్ వారి అనుచరులతో కలిసి జోడేఘాట్లో ‘అవ్వల్ పేన్’ (తల్లి దేవత)ని ఆరాధిస్తున్నారని, వారి యుద్ధ సాంకేతికతను స్త్రీ ఋతు రక్తంతో తడిసిన గుడ్డ ముక్కతో పరిష్కరించవచ్చని గోండ్ ఇన్ఫార్మర్ వారికి చెప్పాడు. అప్పుడు నిజాం ప్రభుత్వ దళాలు భీమ్ -కొండల్, వారి అనుచరులను అక్కడికక్కడే పట్టుకుని వారిపై బాంబులు విసిరారు. కొండల్ పేలుడు నుండి తప్పించుకున్నప్పుడు భీమ్, అతని అనుచరులలో 13 మంది 1940 సెప్టెంబరు 10వ తేదీన బలిదానం చేయబడ్డారు. భీమ్ వీరోచిత మరణానికి లొంగిపోయిన స్వజాతి గోండు కుర్దుపటేల్ కారణం కాకపోతే, ఆదివాసీలకు జల్- జంగిల్ -జమీన్పై ఆ కాలంలోనే హక్కులు వచ్చేవి. అయితే వారి పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది.
గుమ్మడి లక్ష్మీనారాయణ
91822 96576