వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’పదహారు రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్కు డి.సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, దామోదర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీంకి అభినందనలు తెలిపారు.
ఈ వేడుకలో సాయి రణ్ అడివి మాట్లాడుతూ.. “పదహారు రోజుల పండగ టైటిల్ని సూచించింది కృష్ణ వంశీ. ఆయనకి కథ విపరీతంగా నచ్చి ఈ టైటిల్ పెట్టమని చెప్పారు”అని అన్నారు. హీరో సాయి కృష్ణ మాట్లాడుతూ.. సాయి కిరణ్ దర్శకత్వంలో ఇంత మంచి కథతో తన మొదటి సినిమా చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలో రేణు దేశాయ్, గోపిక ఉదయన్, అనసూయ భరద్వాజ్, రామ్, లక్ష్మణ్ మాస్టర్లు, జానీ మాస్టర్, సురేష్ కుమార్, కళ్యాణి సునీల్ పాల్గొన్నారు.