పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగించబడని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను రాష్ట్రంలో తొలి సారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు. పునరుత్పాదక విద్యుత్తు పెంపుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేస్తున్న విశేషమైన కృషిలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియాలో గల తన 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు అనుబంధంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ను ఇటీవల ఏర్పాటు చేసింది. ఇది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్. దీనిని రెండు మూడు రోజుల్లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి.
సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా ఉత్పత్తి చేసే విద్యుత్ను తెలంగాణ ట్రాన్స్కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్ ను గ్రిడ్కు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా నిల్వ చేసి గరిష్ట విద్యుత్ వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు వినియోగిస్తారు. సాంకేతికపరంగా బీఈఎస్ఎస్ అత్యాధునికమైన సోలార్ విద్యుత్తు నిల్వ మరియు పొదుపు వ్యవస్థగా పేర్కొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున సుమారు 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ఒక తొలి అడుగుగా భావించవచ్చు. సుమారు 2.73 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ వల్ల సింగరేణి సంస్థ
ఏడాదికి సుమారుగా వినియోగించబడని 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్ను సద్వినియోగం చేసుకుంటూ 70 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో అనేక సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నప్పటికీ తొలిసారిగా బీఈఎస్ఎస్ ఏర్పాటు చేసే అవకాశం తమకు కల్పించినందుకు సింగరేణి సంస్థ ఛైర్మన్ ,సిఎండీ ఎన్. బలరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సింగరేణి వ్యాప్తంగా అనువైన చోట్ల ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.