గువాహటి: ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదని, అది హత్యే అని మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈహత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. అస్సామీస్తోపాటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబిన్ సెప్టెంబర్ 19న సింగపూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో హిమంత ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ హత్యకేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆయనను కుట్రపూరితంగా హత్యచేశారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, నిందితుల్లో ఒకరు ఆయనను హత్య చేయగా, మిగిలినవారు అతడికి సహకరించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు.
ఈ హత్యతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తుల పైనా పోలీసులు కేసు నమోదు చేశారని, డిసెంబర్లో ఛార్జిషీటు సమర్పించిన తరువాత ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు. సిట్ మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్షాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో జుబిన్ ప్రాణాలు కోల్పోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్ను సింగపూర్ ఆస్పత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్టు తర్వాత వార్తలు వచ్చాయి. జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్జ్యోతి గోస్వామి గాయకుడు జుబిన్కు విషమిచ్చి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.