పారిశ్రామిక, విద్య హబ్గా మారుస్తాం
రూ.5వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్
నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం
మూడు నెలల్లో ప్రతీ గ్రామానికి కృష్ణా నీళ్లు
త్వరలో కొడంగల్లో రైలు కూత
అడబిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు
మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం
అభివృద్ధికి పాటుపడే వాళ్లనే సర్పంచ్లుగా ఎన్నుకోండి
కొడంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అక్షయపాత్ర ఫౌండేషన్ కమ్యూనిటీ కిచెన్ పరిశీలన
భవన నిర్మాణానికి భూమిపూజ
మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: వికారాబాద్ జిల్లాలోని -కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్ను కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్ను నిర్మించుకుంటున్నామని, గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లాల్సిందే అనేవిధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్ను నిర్మిస్తున్నామని అన్నారు. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు.
కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ కావాలని, అందుకే వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ (వికారాబాద్, పరిగి కొడంగల్ నారాయణపేట్, మక్తల్) నుంచి కర్నాటక రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేశామని తెలిపారు. 70 ఏండ్లుగా వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నామని తెలిపారు. ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండలంలో తొందరలోనే సిమెంట్ పరిశ్రమను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు.
ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుతాం
2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడదామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్లో హరేకృష్ణ సంస్థ వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్)ను పరిశీలించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదేవిధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నారని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదని, ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించామని అన్నారు.
మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. కొండగల్ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు. ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నామని తెలిపారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించామని తెలిపారు.. భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారని, మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చామని, లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామికవాడను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని 300 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. అంతకుముందు మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న బస్సును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
రూ.5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్వాడీ భవనాల నిర్మాణం, రూ.5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.3 కోట్లతో నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ), రూ.1 కోటితో కొడంగల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, రూ. 1.40 కోట్లతో కొడంగల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, రూ. 4.45 కోట్లతో సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం, రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభం, రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ. 5 కోట్లతో గెస్ట్హౌస్ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు.
ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహిళలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం, ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించే విధంగా వెయ్యి మంది మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించుకునేందుకు సహకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యాన్ని అందిస్తున్నామని,, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని గుర్తుచేశారు. కొడంగల్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక, విద్యారంగాల్లో అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.
మైనార్టీ శాఖ ద్వారా 625 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నిమిత్తం వికారాబాద్, నారాయణపేట జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు పౌల్ట్రీ, గొర్రెల ఫామ్ ఏర్పాటు నిమిత్తం ఆర్థిక సహాయ చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పోలీస్ హౌసింగ్ ఛైర్మన్ గురునాథ్రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్రెడ్డి, బి.మనోహర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లు రాజేశ్వర్ రెడ్డి, విజయ కుమార్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీకై జైన్, నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమెహ్రా, జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ సత్యగౌడ చంద్రప్రభు దాస్జీతో పాటు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.