మనతెలంగాణ/ హైదరాబాద్: విభాగాల వారీగా ఈనెల 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేళ్ల విజయోత్సవాలుగా జరపాలని సిఎం అధికారులకు సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సిఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సిఎంఓ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినందున, రెండేళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని సిఎం రేవంత్ ఆదేశించారు.
రౌండ్ మీటింగ్లను ఏర్పాటు చేయాలి
డిసెంబర్ 8వ తేదీ, తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని సిఎం రేవంత్ సూచించారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేండ్ మీటింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్ లక్ష్యాలను కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజేంటేషన్లు తయారు చేసుకోవాలని సిఎం సూచించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సిఎం ఆదేశించారు.
ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేయాలి
ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సిఎం ఆదేశించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సిఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు.