ఒక్క అడుగు ఎన్నో అడుగులకు ప్రేరణ ఇచ్చి గమ్యానికి చేరుస్తుంది. ఒక్క అక్షరం జ్ఞాన సౌధానికి పునాది వేసి, ప్రపంచాన్ని మారుస్తుంది. మేధస్సుకు పదును పెట్టి, మనసును స్పృశింప చేస్తే అక్షరం ఆయుధమవుతుంది. అక్షరంతో మొదలైన ప్రయత్నం పుస్తకంగా పరివర్తన చెందుతుంది. గొంతు నుండి ధ్వనించే ప్రతీ పదం మదిని స్పృశించి, మస్థకాన్ని కదిలించే, అక్షరాల అమ్ముల పొదినుండి జారిపడిన పదునైన శరం పుస్తకం. అక్షరం భగభగ మండే అగ్నిగోళం. నిన్న మరచిన నేటికి విలువ లేదు. నేడు లేనిదే రేపన్నది అబద్ధం. కోయిల కమ్మని పాటను మరచి బిత్తర చూపులు చూస్తుంటే, పక్షులు కిలకిల రావాలను మరచి మౌనముద్రలో దాగుంటే, గలగల పారే సెలయేరు ప్రహహించనని భీష్మించుకు కూర్చుంటే తారలు తేజస్సును విడిచి, ఆకసంలో మబ్బుల చాటున దాగుంటే, అక్షరం నిదురబోతే చైతన్యం సమాధికే అంకితమవుతుంది. అక్షరం గర్జించాలి. పుస్తకంగా మారాలి. అవనిపై అన్యాయాన్ని ప్రశ్నించాలి. విద్య అజ్ఞానంపై సంధించిన వజ్రాయుధమైతే, అజ్ఞాన గాఢాంధకారాన్ని తొలగించే అక్షర హారం పుస్తకం. అక్షరజ్ఞానం, పుస్తక జ్ఞానం లేని మానవ జన్మ నిరర్థకం. దైవం కొలువున్న ప్రదేశం దేవాలయమైతే, జ్ఞాన జ్యోతిని వెలిగించే గ్రంథాలకు ఇలలో నెలవైన నిజమైన దేవాలయం.
దేశ స్వాతంత్య్రోద్యమంలోను, సాంఘిక దురాచారాల నుండి మేల్కొలపడం లోను, తెలంగాణలో ఒకప్పటి నిజాం నిరంకుశ పాలన వలన నెలకొన్న అస్థవ్యస్థ పరిస్థితులనుండి కాపాడి, ప్రజలను జాగృత పరచడంలోను గ్రంథాలయోద్యమం పాత్ర అనిర్వచనీయం. ఎంతో మంది అభ్యుదయవాదులు, సంఘసంస్కర్తలు గ్రంథాలయోద్యమంలో పాల్గొని గ్రంథాలయాల స్థాపనకు విశేష కృషి చేసారు. అయ్యంకి వెంకట రమణయ్య తెలుగు వారికి సుపరిచితం. గ్రంథాలయాల ద్వారా ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించాలనే ఉద్దేశంతో అవిశ్రాంత కృషి చేసి, గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొంది, ఆచంద్రతారార్కమైన ఖ్యాతి నార్జించిన ‘అయ్యంకి’ జనహృదయాల్లో పెల్లుబికిన చైతన్య స్రవంతి. ఆంధ్రప్రదేశ్లో 1886వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో స్థాపించిన పౌర గ్రంథాలయం తొలి గ్రంథాలయంగా పిలవబడుతున్నది. అయితే అంతకు ముందు కూడా అనేక గ్రంథాలయాలు స్థాపించబడినట్టు గ్రంథాలయ చరిత్ర విశదీకరిస్తున్నది. గ్రంథాలయం అయ్యంకి మానస పుత్రిక. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ 1914 లో ఏర్పడింది. వేటపాలెంలో ఏర్పడిన సారస్వత నికేతనం గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి.
కేరళలోని ‘త్రివేండ్రం పబ్లిక్ లైబ్రరీ’ ని ఇండియాలో మొదటి లైబ్రరీగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 1872లో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ప్రాచీన గ్రంథాలయంగా పేరుగాంచింది. కొమర్రాజు లక్ష్మణరావు కూడా గ్రంథాలయ ఉద్యమానికి విశేషమైన కృషి చేసాడు. తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ గొంతు ‘కాళోజీ’ గ్రంథాలయోద్యమంలో ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడు. అనేక ఉద్యమాల ప్రభావంతో అప్పటి నల్గొండలో ఆంధ్ర సరస్వతీ గ్రంథ నిలయం, వరంగల్లో ఆంధ్ర భాషా నిలయం ఏర్పడ్డాయి. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ఆలస్యంగా ప్రారంభమైనా తర్వాత క్రమంలో అత్యంత క్రియాశీలకంగా మారింది. హైదరాబాద్లోని కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఒక పురాతన గ్రంథాలయం. గ్రంథాలలోనే నిజమైన విజ్ఞానం నిగూఢమై ఉన్నది. మన ఆలోచనా సామర్థ్యం పెరగడానికి పుస్తకపఠనమే నిజమైన మిత్రుడు. వర్తమానంలో జరుగుతున్న ప్రాపంచిక సంఘటనలు, గతంలో జరిగిన వాస్తవ సంఘటనలను గ్రంథస్థం చేసి, రాబోయే తరాలకు అందించడమే చరిత్ర.
చరిత్ర అనేది బ్రహ్మపదార్ధమేమీ కాదు. చరిత్ర అంటే వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా విశదీకరిస్తూ అక్షర రూపమిస్తూ గ్రంథస్థం చేయడమే. గతంలో చాలామంది కవులు తమ మస్థిష్కంలో మెదిలే ఆలోచనలకు, కల్పనలకు అలంకారాలను జోడిస్తూ హృదయానికి హత్తుకునేటట్టు వివిధ రూపాల్లో తమకున్న ప్రతిభావ్యుత్పత్తులతో జన రంజకమైన రచనలు చేసేవారు. తమ మేధస్సుకు పదును పెట్టి ఆణిముత్యాల వంటి కథాకథనంతో పద్య, గద్య, శిల్ప, చిత్ర, కావ్యరూపాల్లో నాటి సృజనాత్మక శిల్పకారులు, చిత్రకారులు, కవులు విజ్ఙానాన్ని నిక్షిప్తం చేసేవారు. నాటి రచనలు, పద్య, గద్య రచనలు, కావ్యాలు ఎన్ని తరాలకైనా తరగని ఆస్తి. అందుకే మన ప్రాచీనకాలానికి చెందిన గ్రంథాలు ఈనాటీకీ పండిత పామరుల చేత కొనియాడబడుతూ, విశేష జనాదరణ పొందుతున్నాయి. బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. కాలాను గుణంగా మార్పులు రావడం సహజం. మారిన పరిస్థితులకనుగుణంగా సమాజం కూడా అదే నిష్పత్తిలో పరివర్తన చెందుతున్నది. కాలానుగుణంగా వస్తున్న మార్పుల ఫలితంగా పుస్తకాల స్థానాన్ని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. చదువుకోకుండా ఆటపాటలతో అల్లరి చేసే విద్యార్థులను ఉద్దేశించి మన పెద్దలు ‘పుస్తకం హస్తభూషణం’ కారాదు అనేవారు.
ఇది గతకాలపు మాట. చరవాణి నేటి తరానికి హస్తభూషణమై వర్ధిల్లుతున్నది. అసలు పుస్తకమే కనుమరుగైపోయే రోజులు దాపురించాయి. సాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కిన నేపథ్యంలో గ్రంథపఠనం ప్రాధాన్యత కోల్పోయింది. ప్రతీ ఒక్కరూ పుస్తకాలను చదవాలని, విజ్ఞాన సముపార్జన ద్వారానే మానసిక వికాసం కలుగుతుందని, సమాజ పురోభివృద్ధి పుస్తకపఠనం ద్వారానే సాధ్యమవుతుందని ఎంతో మంది విజ్ఞులు ఒక అవగాహనకు వచ్చి, అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలని, అందుకోసం స్వాతం త్య్ర పోరాటం తరహాలో ఉద్యమించారు. వారి పోరాట ఫలితమే గ్రంథాలయాల ఆవిర్భావం. గ్రంథాలయాల ఆవిర్భావం కోసం గ్రంథాలయోద్యమం జరిగింది. నాటి గ్రంథాలయోద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. అయ్యంకి వెంకట రమణయ్యను భారతీయ గ్రంథాలయోద్యమ రూపశిల్పిగా చరిత్ర పేర్కొంటున్నది. ఇండియన్ లైబ్రరీ అసోషియేషన్ ఆవిర్భవించడానికి, జాతీయస్థాయి సమావేశాలకు అది వేదిక కావడానికి ఆద్యుడు అయ్యంకి వెంకట రమణయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వెలగా వెంకటప్పయ్య, పాతూరి నాగభూషణం, బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి మహనీయులెందరో గ్రంథాలయోద్యమానికి నాయకత్వం వహించారు.
దేశం నలుమూలలా అనేక గ్రంథాలయాలను స్థాపించి సామాన్యులందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశమే గ్రంథాలయ వారోత్సవాలకు నాంది పలికింది. అయితే విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లిన గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్నది. మరో గ్రంథాలయోద్యమం ప్రారంభం కావలసిన అవసరం ఏర్పడింది. చరవాణి పుస్తక స్థానాన్ని ఆక్రమించింది. మన ఆలోచనలకు పదునుపెట్టి, మానసిక వికాసం కలిగించిన గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. మన మేధస్సును హరించి, మన ఆలోచనలకు తావులేని మరబొమ్మలుగా తయారు చేస్తున్న సాంకేతిక పరికరాలకు కొంతవరకు విశ్రాంతినిచ్చి, పుస్తక పఠనానికి గవాక్షాలు తెరవాలి. గ్రంథాలయాలు మన పురాతనమైన వెలకట్టలేని ఆస్తిపాస్తులు. వాటిని కాపాడుకోవాలి. పుస్తక పఠనంపై నేటి విద్యార్థికి ఆసక్తిని కలిగించాలి.మనోవికాసానికి గ్రంథాలయాలే ఆలవాలం. పుస్తక పఠనమే మన ఆలోచనా నేత్రాల సక్రమ వీక్షణకు సవ్యమైన మార్గం. అజ్ఞానానికి నిజమైన ఔషధం విలువైన పుస్తకం. గ్రంథాలయ వారోత్సవాల స్ఫూర్తి గ్రంథాలయాల ఆవశ్యకతకు దోహదం చేయాలి. ప్రతీ గ్రామంలో ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలుండాలి. ప్రభుత్వాలు గ్రంథాలయాలకు విలువైన పుస్తకాలను, అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికలను అందుబాటులో ఉంచాలి. పుస్తకమే సమస్త విజ్ఞాన సంపదగా పాఠకులు భావించాలి.