మన తెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ గురువారం నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగింది. దానం, కడియం మాత్రం సమాధానం ఇచ్చేందు కు మరికొంత సమయం కావాలని కోరారు. గురువారం 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తయిన నేపథ్యంలో స్పీకర్ వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సభాపతి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.