భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎస్ వేంకటేశ్వర్ , జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ, స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్రపతి ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అనంతపురం డిఐజీ సీమోషీ ఘోష్, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.