విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని, ఆ స్థితికి మన దేశం చేరుకోవాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్కు నోబుల్ సాధించిపెట్టారు. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. 1930 లో సి.వి. రామన్కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ ఒక్క శాస్త్రవేత్తకు నోబుల్ బహుమతి లభించకపోవడం విచాకరం. మన దేశం లో జన్మించి, విదేశాలలో స్థిరపడ్డ హరగోవింద్ ఖురానా (1968), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009) లకు మాత్రమే సైన్స్రంగంలో నోబుల్ బహుమతులు లభించాయి. సత్యేంద్రనాధ్ బోస్, జి.యం. రాంచంద్రన్, ఉత్పల్, మాణిక్పాల్ భద్ర, మేఘనాధ్ సాహా, శంభునాధ్డే, హోమీ బాబా, జగదీష్ చంద్రబోస్, సి.ఎన్.ఆర్.రావు వంటి భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధనా రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతిగడించినప్పటికీ, నోబుల్ బహుమతులు పొందలేకపోయారు.
1930లో నోబెల్ బహుమతి స్వీకరించిన సందర్భంలో సివి రామన్ బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన సభికులకు తాను ఆవిష్కరించిన రామన్ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు ‘ఆల్కాహాల్’ని మాధ్యమంగా ఉపయోగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాక్టెయిల్ పార్టీలో ‘ఆల్కాహాల్ తీసుకుంటారా’? అని రామన్ను విందుకు హాజరైనవారు అడుగగా ‘ఇప్పటి వరకు మీరు ఆల్కహాల్లో రామన్ ఎఫెక్టు చూసారు, రామన్పై ఆల్కహాల్ ఎఫెక్ట్ చూడాలని కోరుకోవద్దు’ అని చమత్కరించి పరోక్షంగా తాను మద్యానికి దూరంగా ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర వెంకట్రామన్ 1888 నవంబర్ 7న ఆనాటి మద్రాసు ప్రావిన్సులోని తిరుచరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాల్లకు జన్మించారు. ఆయన బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా వుంటూ కేవలం 11 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. చిన్నతనంనుంచే పరిశోధన రంగంపై ఆసక్తి వున్న ఆయన విద్యాభ్యాసం అనంతరం 1907లో ఇండియన్ ఫైనాన్స్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ ఎకౌంటెంట్ జనరల్గా చేరారు.
ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు పరిశోధనపై దృష్టి సారించారు. తన లక్ష్యసాధన కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. 1919లో ‘ది ఇండియన్ అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్కు’ గౌరవ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివి రామన్ కాంతిపై పరిశోధనలుచేసి 1928లో ‘రామన్ ఎఫెక్టు’ కనుగొన్నారు. కాంతి కిరణాలు ఒక ద్రవపదార్ధంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది, అంటే కాంతికిరణాలలోని ఫొటాన్ కణాలు ద్రవపదార్థాల పరమాణువులపైపడి పరిక్షేపణ చెందుతాయి. దూరపు కొండలు, సముద్రపు నీరు, ఆకాశం నీలి రంగులో ఉండటానికి గల కారణాలను రామన్ ఎఫెక్టు విశ్లేషిస్తుంది. వైద్యరంగంలో మందుల్ విశ్లేషణకు, రసాయన పదార్థాలలోని అణువులు, పరమాణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్ ఎఫెక్టు దోహదపడుతుంది.
రామన్ ఫలితం ఆహారపు నాణ్యతని నిర్ధారించడంలో, పదార్థాల అణువుల నిర్మాణాన్ని గుర్తించడంలో, పదార్థాల రసాయనిక, భౌతిక గుణాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. రామన్ ఫలితాన్ని ఉపయోగించి యానక పదార్థం నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. పదార్థాల స్పటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. ఆయన పరిశోధనలకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్టు కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్ దినోత్సవంగా’ ప్రకటించింది. 1933లో బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ కు రామన్ డైరెక్టర్గా నియమించబడ్డారు. 1948లో ఆయన బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను’ స్థాపించి పలువురు యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం రూ. 250తో రామన్ తన ప్రయోగాన్ని ఆవిష్కరించడం విశేషం.
1954లో రామన్ని ‘భారతరత్న’ వరించింది. మత విశ్వాసాల ఆధారంగా విద్యాలయం నడిపే ఒక మతసంస్థ రామన్ను తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తే ‘స్వర్గం, నరకం, పునర్జన్మ వంటి అశాస్త్రీయ విషయాలపై నేను మాట్లాడను’ అని ఆ సంస్థ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ‘సైన్సే నా మతం’ అని రామన్ స్పష్టం చేశారు. ఆయన ధ్వనిపై కూడా పలు పరిశోధనలు చేసారు. నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరొకవైపు ‘దేశం పరాయిపాలనలో ఉందని బహుమతి అందుకునేటప్పుడు నా దేశం తరపున, నా దేశ జాతీయజెండా లేకపోవడం నన్ను బాధిస్తుందని’ రామన్ తెలిపి దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు.
‘ది లైట్ ఆఫ్ ఏషియా’ పుస్తకం రామన్పై అమిత ప్రభావం చూపించింది. ఆత్మన్యూనతా భావాన్ని, ఓటమి భయాన్ని వీడి ధైర్యంతో ముందడుగు వేసి పరిశోధనా రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా నిలపాలని, నిరంతర పరిశీలన, అధ్యయనంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సివి రామన్) 1970 నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు. ఇటీవల ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో కూడా మన దేశానికి స్థానం దక్కలేదు.అందుకే సివి రామన్ స్ఫూర్తితో నేటి పాలకులు పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనదేశం సైన్స్ ఆవిష్కరణలలో ముందుండే అవకాశం ఉంటుంది.
– యం. రాంప్రదీప్
94927 12836