అమరావతి: ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు అని.. ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాయి కుల్వంత్ హాల్ లో మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా నాణెం, స్టాంపులను ఆవిష్కరించి, విడుదల చేశారు. పుట్టపర్తిలో మోడీ మీడియాతో మాట్లాడుతూ.. భౌతికంగా బాబా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందని, విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని తెలియజేశారు. భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రమని, భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడు సేవతోనే ముడిపడి ఉంటాయని, సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని అన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు.. ఇదే బాబా నినాదమని మోడీ పేర్కొన్నారు.
బాబా బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందని, కోట్లమంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారని అన్నారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని, చాలామంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. లక్షలమందిని బాబా సేవా మార్గంలో నడిపించారని, సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. తాగునీరు, వైద్యం వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని, 20 వేల మంది బాలికలకు ఇవాళ సురక్ష సమృద్ధి యోచన అందించారని చెప్పారు. బాలికల ప్రగతిలో సురక్ష సమృద్ధి యోచన కీలకమైందని, గరీబ్ కల్యాణ్ యోచన లబ్ధిదారుల సంఖ్య వంద కోట్లకు చేరిందని అన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకెళ్లాలని, స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పుట్టపర్తి పవిత్రభూమిలో ఏదో మహత్తు ఉందని, సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్థిల్లాలని మోడీ స్పష్టం చేశారు.