జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఘన విజయంగా చూపించుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం అని, దీన్ని ప్రజల ఆమోదంగా చెప్పుకోవడం అవివేకం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటమలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారడంతో సిఎం సహా15 మంది మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, ఎంపీలు, కార్యకర్తలు, పోలీస్ వ్యవస్థ, డిజిపి వరకు మొత్తం యంత్రాంగాన్ని మోహరించారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బీహార్, రాయలసీమ, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో కనిపించిన విధంగానే ఉన్నాయని అన్నారు. ఆడబిడ్డపై దాష్టీకం జరగడం నుండి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వరకు ప్రతి దశలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులు, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ విజయాన్ని కట్టిపడేశారని పేర్కొన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి కాదు,
నవీన్ యాదవ్ను చూసి ఓటు వేశారని చెప్పారు. 2023లో ఓడిపోయిన అజహారుద్దీన్కు టిక్కెట్ ఇవ్వకపోవడం, రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన గద్దర్ను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పక్కనపెట్టడం- కాంగ్రెస్లో జరుగుతున్న అసలు రాజకీయాలకు ఉదాహరణలు అంటూ విమర్శించారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మిత్రులకు మాత్రమే టిక్కెట్లు, పదవులు లభిస్తున్నాయని అన్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, నదీమ్ జావేద్ వంటి నాయకులను ఆయన సహించలేకపోతున్నారని ఆరోపించారు. ఎంఎల్ఎలతో, నాయకులతో అవమానకర పదజాలం ఉపయోగించడం రేవంత్రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. బండి సంజయ్తో కుమ్మక్కై బిజెపి ఓట్లు కాంగ్రెస్కు మళ్లించారని, అసదుద్దీన్ ఒవైసీని బ్రతిమిలాడి బోగస్ ఓట్లు వేసేలా చేసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. బీహార్లో ఇండియా కూటమి ఓటమికి కారణమైన ఎంఐఎంనే ఇక్కడ పొగడడం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దాసోజు శ్రవణ్ విమర్శించారు.