జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంతో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంచారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అబద్దాలు, అవాస్తవాలు, విష ప్రచారాలు చేసిన పార్టీలకు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకొని తమ నోటికి తాళం వేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా విజేత నవీన్ యాదవ్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యదక్షతకు ఈ ఫలితం ఒక రెఫరెండంగా నిలిచిందన్నారు.
ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూబ్లీహిల్స్ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఇందుకు ప్రభుత్వం తరపున అన్నివేళలా సహకారం ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా తాను ఇన్చార్జీగా వ్యవహారించిన రహ్మత్నగర్ డివిజన్లో అధిక మెజార్టీ కాంగ్రెస్కు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన తెలిపారు.