హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిహెచ్ఎంసి లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా అవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో జూబ్లీహిల్స్ ను బిఆర్ఎస్ పట్టించుకోలేదని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పదేళ్లు జూబ్లీహిల్స్ ను భ్రష్టు పట్టించాడని విమర్శించారు. కెటిఆర్ నాయకత్వంలో పని చేయాలో లేదో బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రచారం చేయడంపై బిఆర్ఎస్ వైఫల్యాలను ప్రధానంగా వివరించామని అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని వివేక్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో కమలం పార్టీ కనుమరుగైపోయిందని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎదురీదుతున్నారని, బిజెపి అయితే కనీసం పోటీలో కూడా లేదని అన్నారు. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకు పోతుందని, 7 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 19 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.