భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఆర్టికల్ 324 తెలుపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా పనిచేసే అతికొద్ది సంస్థల్లో భారత ఎన్నికల వ్యవస్థ ప్రధానమైనది. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకై ఓటర్లకు సంబంధించిన ఓటరు జాబితాను తయారు చేసేది, వివిధ రాజకీయ పార్టీలకి గుర్తింపును, రాజకీయ పార్టీలకి చిహ్నలను కేటాయించేది కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి నూతనంగా ఏర్పాటు అయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వ్యవస్థపై పెత్తనం చెలాయించి వివిధ రాజకీయ పార్టీలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించేలా వేటికి కూడా హక్కు ఎన్నికల వ్యవస్థపై ఉండదు. భారతదేశం అంటే స్వేచ్ఛ, సమానత్వ, సోదరభావ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ దేశంగా ఉండడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా అంబేద్కర్ ఎన్నికల వ్యవస్థకు చాలా పటిష్టమైన భద్రతను ఇస్తూ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. అందుకే కేంద్ర, రాష్ట్రాలల్లో ఎంతటి బలమైన ప్రజాబలం ఉన్న నాయకులు ఉన్నప్పటికీ ఎన్నికల వ్యవస్థను, వాటిని నడిపే అధికారులను ఆయా పార్టీలకి, ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరించడానికి సాధ్యం లేదు.
ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి భారత రాజ్యాంగం రూపం లో ఎన్నికల వ్యవస్థకి అత్యున్నతమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నది. ఇది భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి నిదర్శనం.కానీ గత దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డిఎ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఎన్నికల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనేక సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష పార్టీ నాయకులు బలమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తూ హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వ్యవసను తమకి అనుకూలంగా మలుచుకొని హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆధారాలతో సహా నిరూపించారు. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో ప్రొజెక్టర్లో ఫోటో, వీడియోలు వేసి ఎన్నికల వ్యవస్థ లోపాలను వివరిస్తూ దాదాపు 25 లక్షల నకిలీ ఓట్లు హర్యానాలో ఉన్నాయని చెప్తున్నారు. అందువల్లనే హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
అందుకు బలమైన ఆధారాలు చూపిస్తూ బ్రెజిల్ దేశానికి చెందిన మోడల్ పేరుపై వివిధ పేర్లతో హర్యానాలో 22 చోట్ల ఓటు హక్కు ఉండడం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ విధానానికి బిజెపి పాల్పడుతున్నదని నమ్మక తప్పని పరిస్థితి నెలకొన్నది. అంతేకాదు బ్రెజిల్ మోడల్ కూడా రాహుల్ గాంధీ చూయించిన ఆధారాలకు స్పందించి అవి తాను గతం లోని మోడల్ ఫోటోలు అని, ప్రస్తుతం భారతదేశంలో తాను వైరల్ అవ్వడం, ఓటు హక్కు కూడా ఉండడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మన దేశంలోని ఎన్నికల వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం కాదా, విదేశీయుల ముందు అత్యున్నత విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కదా! మరి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం తప్పులేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహరించనప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థపై తప్పుడు ఆరోపణ చేస్తూ, ఎన్నికల వ్యవస్థనే అభాసుపాలు చేస్తున్నారని ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రతిపత్తిని కాపాడుకోలేకపోతున్నదంటే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నదా! అనే విషయాన్ని మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం నమ్మక తప్పడం లేదు! ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక్క ఓటే నాయకుల గెలుపు, ఓటమిని నిర్ణయిస్తుంది.
కాబట్టి భారతదేశమంటేనే ఒకే వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ అనే రాజ్యాంగబద్ధమైన ఉన్నత విలువలతో కూడిన అంశం కాబట్టి ఒక్క ఓటు అయినా ముఖ్యమైనదనే విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చూపిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఓటు దొంగతనానికి పాల్పడుతున్నదనే అంశంలో మోడీ నేతృత్యంలో ఎన్డిఎ ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు లేనప్పుడు కేంద్ర ఎన్నికల సంస్థను తమకు అనుకూలంగా కీలుబొమ్మగా మార్చుకోవడం లేదని నిజం అయితే, తప్పుడు ఆరోపణలు చేస్తూ భారతీయ ప్రజల ఓట్లని, ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచేలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు తీసుకోవడం లేదు? అంటే రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉన్నదని ప్రధాని మోడీ చెప్పదలుచుకున్నారా! అంటే భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికల వ్యవస్థకి కల్పించిన స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ దుర్వినియోగం చేస్తున్నారంటే భారత రాజ్యాంగాన్ని, 140 కోట్ల భారతీయ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమాన పరుస్తున్నట్లే కదా! భారతీయులు తమ విలువైన ఓటు హక్కుతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో లేని వ్యక్తులపై ఓట్లు చూయించి, ఒక వ్యక్తికే అనేక ప్రాంతాల్లో ఓట్లు చూయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే భారతీయ ప్రజల ఆలోచనకి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు, ప్రజల ఇష్టాలకు గౌరవం లేనప్పుడు దేశ ప్రజలను గొప్పదైన రాజ్యాంగాన్ని పాలకులు ఇష్టానుసారం అగౌరపరుస్తున్నట్లే కదా! అలాంటప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు ఎలా వర్ధిల్లాబడతాయి! కాబట్టి అంతిమంగా ఇలాంటి అనేక సందేహాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు నైతిక విలువలతో వ్యవహరించి 140 కోట్ల మంది భారతీయులకి వాస్తవాలతో కూడిన సమాధానం చెప్తూ, భారత సార్వభౌమాధికారాన్ని, భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఉండే స్వతంత్ర ప్రతిపత్తిని రక్షించి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ పార్టీలకతీతంగా, కుల, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.
పుల్లెంల గణేష్, 95530 41549