పెన్షనర్లకు సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవ ప్లాట్ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవతో ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకోవచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.- పెద్దలకు సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, మీసేవా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ పారదర్శకతతో పాటు గౌరవాన్ని కలిగించే టెక్నాలజీ ఆధారిత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ సేవకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. వినియోగదారుల సంఖ్య సంవత్సరం వారీగా పెరుగుతోందని చెప్పారు. 2022- 23లో 143, 2023- 24లో 31,295, 2024- 25లో 64,612, ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ 11 వరకు
13,214 మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారని వివరించారు. మొత్తం ఇప్పటివరకు 1.09 లక్షలకుపైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు ఈ సదుపాయంతో లాభపడుతున్నారని వివరించారు. మీసేవా యాప్లో ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణ వ్యవస్థతో గుర్తింపు పూర్తయిన వెంటనే లైఫ్ సర్టిఫికెట్ ఆటోమేటిక్గా ప్రభుత్వ రికార్డుల్లో అప్డేట్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా అధికారులు ఈ సేవను నిరంతరం అందుబాటులో ఉంచి పెన్షన్ చెల్లింపులు అంతరాయం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు. పెన్షనర్లకు ప్రయాణం, కాగిత పనులు, క్యూలైన్ల కష్టాలు అన్నీ తొలగిపోయాయని తెలిపారు. తద్వారా మీసేవా రాష్ట్ర డిజిటల్ పాలనలో మరో కీలకమైన దశను అధిగమించింది. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ ద్వారా 300కి పైగా ప్రభుత్వ, వ్యాపార సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.