మనతెలంగాణ/హైదరాబాద్: ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లకుపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య ను పొందే హక్కును దూరం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మంగళవా రం సోమాజిగూడ డివిజన్లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఆశయాలను నాశనం చేసి, తెలంగాణ వి ద్యావంతులైన యువతను బలహీనపరిచేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ను విడుదల చేయకుండా, మనుగడ కోసం పోరాడుతు న్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు
గురిచేస్తోందని అన్నారు. బకాయిలు చెల్లించకపోవడం ద్వారా దళిత, ఆదివాసీ, బహుజన, పేద అగ్రకుల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆశలను అణిచివేసేందుకు పన్నిన పన్నాగం అని ఆరోపించారు. విద్యార్థుల ఫీజులు కూడా చెల్లించలేని ముఖ్యమంత్రి, జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, సంస్థలను బెదిరించి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
2023 ఎన్నికలకు ముందు 420 తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయడంలో విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు వంటి అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. హైదరాబాద్లో ఉచిత నీటి సరఫరా పథకాన్ని కూడా ఆపివేసిందని పేర్కొన్నారు. భార్యలకు ఉచిత బస్సు ప్రయాణం అంటారు.. కానీ, భర్తలకు మాత్రం టికెట్ ధరను రెట్టింపు చేశారని, ఇదేనా వాళ్ళు చెప్పే సంక్షేమం..? అని ప్రశ్నించారు. కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. 2014కి ముందు నగరంలో కరెంటు కోతలు, నీటి కొరత తీవ్రంగా ఉండేవని, ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉండేది, ప్రతి వేసవిలో నీటి కొరత తప్పేది కాదని పేర్కొన్నారు. కానీ, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ నిరంతర విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు, వేగవంతమైన పట్టణాభివృద్ధికి నమూనా రాష్ట్రంగా మారిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 3 లక్షల నుంచి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని, పరిశ్రమలను విస్తరించి, శాంతిభద్రతలను కాపాడామని వివరించారు.
ఇది కారుకు.. బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, ధనవంతులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రం వదిలిపెడుతోందని కెటిఆర్ మండిపడ్డారు. మురికివాడల్లో ఉండేవాళ్ల ఇళ్లను కూల్చుతారు..కానీ మంత్రులు, కాంట్రాక్టర్ల బంగ్లాలను మాత్రం తాకరు అని, ఇదేనా న్యాయం..?అని నిలదీశారు. ఇది సాధారణ ఎన్నిక కాదు అని, కారుకు.. బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. బుల్డోజర్ ప్రభుత్వాన్ని ఆపడానికి ప్రజలు కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని కెటిఆర్ జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ఈ మొండి ప్రభుత్వానికి గట్టి సందేశం పంపే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు ఉందని,- కారు గుర్తుకు ఓటు వేసి, కెసిఆర్ పాలనను తిరిగి తీసుకురావడానికి జూబ్లీహిల్స్ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల గందరగోళానికి మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. తేడా ఏంటో ప్రజలు చూశారు.. ఇప్పుడు తెలంగాణ బిఆర్ఎస్తో ముందుకు సాగాలా లేక కాంగ్రెస్తో వెనక్కి వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నవంబర్ 11న కారు గుర్తుకు ఓటు వేసి, తెలంగాణ భవిష్యత్తును రక్షించచాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.