మావోయిస్టు పార్టీ మరోసారి కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోమవారం ఒక లేఖ విడుదల చేసింది. లేఖలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని జగన్ లేఖలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని,ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని లేఖలో వివరించారు. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని జగన్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని, గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామంటూ లేఖలో జగన్ పేర్కొన్నారు.
00