మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. మణుగూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి దహనం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్లో మాట్లాడారు. 60 లక్షల బిఆర్ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. త్వరలోనే మణుగూరును సందర్శిసాను అని కెటిఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కెటిఆర్ అన్నారు.