ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు రూ. 1,031 కోట్ల రూపాయలను డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటి సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను విడుదల చేశామని ఆయన చెప్పారు.
దీంతో పాటు పది లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటి సిఎం వెల్లడించారు. కాగా, వెయ్యి కోట్లలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ. 320 కోట్లు ఉన్నాయన్నారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన పది లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేసినట్లు వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లులకు చెందిన రూ. 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
000000