రాష్ట్రంలో 500 రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వం రాబోతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని.. వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు నాయకులు కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు.
ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని అన్నారు. ఇవి కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కెటిఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను కోరారు.