ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.- కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.- రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్రస్థాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లానుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించడం జరిగింది.- క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బిసి, ఎస్సి, ఎస్టి, సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది.- ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది.- కౌలురైతులకు గుర్తింపుకార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని, కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు.- రాష్ట్రంలో కౌలురైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో కౌలురైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడమే. కౌలురైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడంపట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కూటమి ప్రజాగళం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంటల బీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా… ఇది కార్యరూపం దాల్చకపోవడంతో కౌలు రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కౌలురైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల కౌలురైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు. సామాజికంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగు బలహీనవర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.- ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.- కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది.- క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో మాట్లాడినప్పుడు నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు.- రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చనే పలుచోట్ల కౌలురైతులు తెలిపారు.- కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్తబుట్టలో వేశారా? లేక పరిగణనలోనికి తీసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదని పలుచోట్ల రైతులు తెలిపారు.- ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా కౌలు చట్టం అమలు కాలేదు, గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది.- ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు.- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలురైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది, గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువధరకు అమ్మాల్సి వస్తోంది.- వర్షాభావం, తెగుళ్లవల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు.- చాలా మంది కౌలు రైతులు నోటిమాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు, ఫలితంగా సాగుచేయడానికి భూమిని, భూమిలోపెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.- ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలురైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు, దీంతో దిగుబడి తగ్గుతోంది.- కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు.- రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.- భూయజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.- కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.
కోనసీమ జిల్లా… ఐ. పోలవరం గ్రామంలో ఒక సామాన్య రైతు చెప్పిన ఈ యదార్థ కథ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతుల పరిస్థితి అద్దం పడుతుంది. దాదాపు రాష్ట్రంలోని కౌలు రైతులంతా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. – కౌలుకు సాగు చేస్తే రెండు ఎకరాలకు దిగుబడి 140 బస్తాలు వస్తాయి. (మొదటి పంటకు 60బస్తాలు, రెండో పంటకు 80బస్తాలు) ఒక బస్తా 75 కేజీలని మన గమనంలో ఉండాలి.- రెండు ఎకరాలు కలిగిన భూ యజమానికి రూ. కౌలు నిమిత్తం 48 బస్తాలు ఇవ్వాలి.(అంటే రెండు పంటలకు కలిపి ఎకరాకు 24బస్తాలు) కౌలు పోను102 బస్తాలు మిగులుతుంది.- 102 బస్తాలు రూ.1600లకు అమ్మితే వచ్చే ఆదాయం రూ.163,000. (ఒక బస్తాను రూ.1600లకు అమ్మితే)- పెట్టుబడి రెండు ఎకరాలకు రెండు పంటలకు కలిపి రూ.1,40,000. (మొదటి పంటకు రూ. 60వేలు, రెండో పంటకు రూ. 80వేలు)- పెట్టబడికి తెచ్చిన అప్పుకు వడ్డీ సుమారు రూ. 20వేలు కలుపుకుంటే మొత్తం రూ.1,60,000. మొత్తం ఆదాయంలో నుంచి ఖర్చులు తీసివేస్తే రూ. 3000వేలు మిగులుతుంది.- సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక రైతు కుటుంబానికి రూ. 3000, రోజుకు రూ. 8లు మిగులుతుంది.- భూమి సారం, విత్తన నాణ్యత, నీటి లభ్యత, వాతావరణం అనుకూలం, తెగుళ్లు లేకుండా ఉండి కూలీలు తక్కువ ఉపయోగించుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే ఆ సమయంలో మార్కెట్ లో కనీసం మద్దతు ధరలు దక్కించుకుంటే ఆ మేరకు అప్పులు లేకుండా బయట పడతాడు లేకపోతే కోలుకోలేని దెబ్బ తింటాడు.కౌలు దోపిడీ,వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్పుట్ ధరల దోపిడీ (విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు నిరంతరం పేరుగుదల) వీటికి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు.- చెమట చుక్క చిందించకుండానే భూయజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు. పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో, రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కృంగిపోతుంటారు. తద్వారా అనేక రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు కౌలుగుర్తింపు కార్డు (భూ యజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు ఉన్నారు.- ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు.- ఒక మాటలో చెప్పాలంటే యజమానిని బతికించడం కోసమే కౌలురైతులు బతుకుతున్నారా? అన్నఆలోచన రాకతప్పడం లేదు. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యజమానులకు (వ్యవసాయానికి సంబంధించిన) ఎటువంటి ఆందోళనలు, మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏ రోగాలు లేకుండా జీవితం గడుపుతున్నారు. పైగా కౌలురైతులపై వివిధ ఆరోపణలు చేస్తుంటారు.- ప్రస్తుతం రాష్ట్రంలో 25% మంది భూయజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.- మరి కొంత మంది సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నా రు.- ముఖ్యంగా సొంత భూమిలేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగుచేసే వారు గణనీయంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల ప్రాథమిక స్థితి!
– దిలీప్రెడ్డి
సమకాలీనం
(రచయిత పొలిటికల్ అనలిస్ట్,
డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)