దూల్పేట్ నుంచి హైదరాబాద్లో గంజాయి వ్యాపారాలు కొనసాగించే లేడీ డాన్ అరుణ్ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్కి హైకోర్టులో చుక్కెదురైంది. పిడి యాక్ట్పై ఆమె దాఖలు చేసిన పిటిషన్ను డివిజన్ బెంచ్ ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. అంగూర్ భాయ్పై పోలీసులు పిడి యాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై పెట్టిన పిడి యాక్ట్ ను సవాలు చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టును ఆశ్రయించింది. పిడి యాక్ట్ పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డివిజన్ బెంజ్ న్యాయమూర్తులు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లు విచారిచారు. వాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ కొనసాగించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ న్యాయవాది రవి కుమార్లు వాదనలు వినిపించారు.
గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై ఎక్సైజ్ శాఖ ఎస్టిఎఫ్ ఏటీం లీడర్ అంజిరెడ్డి, దూల్పేట ఎక్సైజ్ సిఐ మధుబాబులు అంగూర్ భాయ్ పై అనేక కేసులు ఉండడంతో పిడి యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు. అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నియమించిన అడ్వైజరీ బోర్డు 2025 మార్చి 10న ప్రతిపాదనలకు పంపించారు. బోర్డు సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి 2025 ఏప్రిల్ 15న అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిడి యాక్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంగూర్ భాయ్ పై పిడి యాక్ట్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేయడం పట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.