మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచి వారికి తీరని అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ నేతలు నగరంలో ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సాధక బాధాకలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మష్రత్ ఆలీతో కెటిఆర్ మాట్లాడి ఆయన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని తానే స్వయంగా తీసుకువెళ్లానని తెలిపిన ఆలీ ఆ తర్వాత తనకు ఉన్న రెండు ఆటలు అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్గా కూలీగా పనిచేస్తున్నట్లు తన బాధలు చెప్పుకున్నారు.
మష్రత్ అలీ పరిస్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కెటిఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని మోసాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కెటిఆర్ తెలంగాణ భవన్కి చేరుకొని ఆ తర్వాత అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు. మస్రత్ అలీకి రెండు ఆటోలు ఉండేవి, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని అమ్మాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడాయన రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలకే సంపాదిస్తున్నారని వెల్లడించారు. అందులో ఆటో కిరాయి నాలుగు వేలు కట్టాల్సి వస్తోందని.. ఇక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని మస్రత్ అలీ బాధపడినట్లు చెప్పారు.
161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండా కింద ఆటో అన్నల మూడు చక్రాలు నలిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో అహనా పెళ్లంటా సినిమాలా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్ ఓట్లు దండుకుందని ఆరోపించారు.
తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని.. ప్రజలు ఆ డబ్బులు తీసుకున్నా, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో నాలుగు కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.
నెలకు 2500 చొప్పున ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 60 వేలు బాకీ పడిందని.. ఆటో అన్నలకు.. వృద్ధులకు.. అందరికీ రేవంత్ సర్కార్ బాకీ పడిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల కోసం డబ్బులు ఇస్తే.. వాటిని కూడా తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎక్కడా అని ప్రశ్నించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కారును పోలిన గుర్తులను కొందరు అభ్యర్థులకు కేటాయించి.. ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తు పై నుంచి మూడో నెంబర్లో ఉంటుందని.. అందరూ జాగ్రత్తగా ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో షాక్ ఇస్తేనే మనకు వాళ్లు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని తెలిపారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే మాగంటి సునీతకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.