మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల పరకామణి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎపి హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. టిటిడిలోని పరకామణిలో రవికుమార్ అనే క్లర్క్ చేసిన దొంగతనం వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ కేసును లోక్ అదాలత్లో హడావిడిగా రాజీ చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిఐడిని ఆదేశించింది. అంతేకాకుండా నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఎసిబి దర్యాప్తు చేయాలని కూడా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమలలో శ్రీవారి కానుకలు లెక్కించే పరకామణి విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి రవికుమార్ ఓ సారి విదేశీ డాలర్లను తీసుకెళ్తూ దొరికిపోయారు. రవికుమార్పై కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేపట్టకుండా ఈ కేసును లోక్ అదాలత్లో టిటిడి అధికారులు రాజీ చేసుకున్నారు. ఇది అక్రమాలను దాచిపెట్టే ప్రయ త్నంగా సాధు పరిషత్ వంటి సంస్థలు ఆరోపించాయి. దీంతో సాధు పరిషత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ‘పరకామణి చోరీ కేసును హడావిడిగా రాజీ చేయడం వెనుక పెద్ద అక్రమాలు ఉన్నాయి. టిటిడి బోర్డు, అధికారుల పాత్రను సమగ్రంగా విచారించాలి‘ అని వారు వాదించారు.
గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికీ రికార్డులు సీజ్ చేయకపోవడపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో అప్పటిక్పపుడు పోలీసులు రికార్డులు సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. సోమవా రం జరిగిన విచారణలో మొత్తం కేసు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించాలి. లోక్ అదాలత్ రాజీలో టిటిడి బోర్డు, అధికారుల పాత్రను పూర్తిగా పరిశీలించాలని ఆదేశించింది. అదే విధంగా రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిరాస్తులు, చరాస్తులు, బ్యాంకు ఖాతాలపై విచారణ చేపట్టాలి. ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి బదలా యించారా అనే అంశాన్ని కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. సిఐడి, ఎసిబి తమ దర్యాప్తు నివేదికలను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసును మొదట బిజెపి నేత, టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేసి సంపాదించిన ఆస్తుల్లో చాలా కొద్ది మాత్రమే టిటిడి పేరుపై రిజిస్టర్ చేయించారని, వంద కోట్లకుపైగా ఆస్తులను నాటి టిటిడిలో ఉన్నకొంత మంది ఉన్నతాధికారులు, వైసిపి నేతలు తమ బినా మీల పేర్లతో రాయించుకున్నారన్న ఆరోపణలు చేశారు. వీటిపై విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సిట్ను నియ మించింది. ఇప్పుడు కోర్టు సిఐడి, ఎసిబి దర్యాప్తునకు ఆదేశించడంతో మొత్తం చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రవికుమార్ ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.