మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీష్ రావును తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని వారు ఆనందం వ్యక్తం చేశారు.తమ సమస్యను కాంగ్రెస్, బిజెపి ఎంపీలు, ఎంఎల్ఎ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పారు.
ఈ సందర్భంగా హరీష్ రావు జోర్ధాన్ నుంచి వచ్చిన వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్లో వార్డు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని జోర్డాన్లో అనుభవించిన బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు వలస కార్మికులు పయనమయ్యారు. కెసిఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేశామని హరీష్రావు తెలిపారు. బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని, వెంటనే స్పందించి వారికి సాయం అందించాలని కోరామని చెప్పారు. జోర్డాన్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా స్పందన లేదని అన్నారు. అందుకే జోర్డాన్లో చిక్కుకున్న12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని తెలిపారు. ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూన్నారని, మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బిఆర్ఎస్ పార్టీ 12 మందినీ కాపాడి స్వదేశానికి తీసుకువచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతా అని వాళ్లకోసం ప్రత్యేక పాలసీ తెస్తామని, నిధులు పెడతామని చెప్పారని, రెండేళ్లయినా రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదని విమర్శించారు. రేవంత్రెడ్డి ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు.