దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉన్నదా అంటే దానికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. తీవ్రస్థాయిలో విషపూరిత పొగమంచు దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నరకంలా మారింది. ఢిల్లీ వరుసగా మూడో రోజూ వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత సూచీ 402 కి చేరింది. జహంగీర్పురి ప్రాంతంలో ఈ సూచీ 506, సోనియా విహార్లో 462 కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని నరకంగా మార్చేసిన వాయు కాలుష్యం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ ప్రకటించింది. కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.
ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 50 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ- ఎన్సిఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్గా గుర్తించారు. రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత దశాబ్ది కాలంగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యుపి, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వల్ల, అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది. ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయు కాలుష్యం సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 402, అలాగే రెస్పిరబుల్ పార్టీకు లెట్ మ్యాటర్ 380, నైట్రోజెన్ డయాక్సయిడ్ 32, సల్ఫర్ డయాక్సయిడ్ 13, ఓజోన్ 68, కార్బన్ మోనాక్సయిడ్ 21 గా ఉంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. కోరలు చాచిన వాయు కాలుష్యం ఈదుస్థితిని తీసుకొచ్చింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతున్నది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే, మానవ తప్పిదాలు ఈ వాయు కాలుష్యం స్థాయిలను మరింత పెంచి పీల్చే గాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలు తోడు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ శీతాకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ఊపిరి పీల్చుకోలేని ఉక్కిరిబిక్కిరి పరిస్థితి సృష్టిస్తున్నాయి. భవన నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము, ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.
పొల్యూషన్ మానిటరింగ్ మెకానిజం లేక ప్రజలకు కాలుష్యం దుష్ప్రభావాలు తెలియక తీవ్ర సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి, వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయువులు, కణాలు, జీవ అణువులతో సహా హానికరమైన లేదా అధిక పరిమాణంలో ఉన్న పదార్థాలను భూమి వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు వాయు కాలుష్యం సంభవిస్తుంది. ఇది మానవులకు వ్యాధులు, అలెర్జీలు, మరణానికి కారణం కావచ్చు. ఇది జంతువులు, ఆహార పంటలు వంటి ఇతర జీవులకు కూడా హాని కలిగించవచ్చు. సహజమైన లేదా నిర్మించిన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ కార్యకలాపాలు, సహజ ప్రక్రియలు రెండూ వాయు కాలుష్యాన్ని సృష్టించగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది మరణాలకు కారణమైంది.
పరిశ్రమలు, రవాణా మొదలైన ప్రజల కార్యకలాపాల ద్వారా తయారైన విష పదార్థాలు సమాజాన్ని చుట్టే గాలిని కలుషితం చేస్తాయి. ప్రధాన కాలుష్య కారకాలు దహన, చెత్తను తగులబెట్టినప్పుడు రసాయన ప్రతిచర్యల వల్ల దుమ్ము, మసి, ఆటోమొబైల్ పెట్రోలియం వాహనాల ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ వంటి సల్ఫరస్ వాయువులో ఉండే నత్రజని ఆక్సైడ్లు, కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని, ఆస్తిని, జంతువులు, మొక్కలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సహజ పరిస్థితులు, క్షీణత, శ్వాసకోశ వ్యాధులు, శ్వాసనాళ ఆస్తమా వంటి వివిధ వ్యాధుల ప్రేరణ. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే పిఎం 2.5, పిఎం 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. ఎసిలు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
– డా. ముచ్చుకోట సురేష్ బాబు
– 99899 88912