కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి చంపిన కసాయి భర్త సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలంలో చోటుచేసుకుంది. ఏన్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాలనీ నాచారం గ్రామానికి చెందిన తాటి రామారావు, తాటి గోవర్షిని భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోవర్షిని అదే గ్రామానికి చెందిన అఖిల్ అలియాస్ ఆదామ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సుమారు ఎనిమిది నెలల క్రితం భర్త, పిల్లలను వదిలిపెట్టి ఆమె అఖిల్తో పారిపోయింది. ఈ నేపథ్యంలో రామారావు తన భార్యను పలుమార్లు ఇంటికి పిలుచుకుని వచ్చినా, ఆమె మళ్లీ అఖిల్ వద్దకే వెళ్లిపోయేది.మూడు రోజుల క్రితం పాల్వంచలో చదువుతున్న తమ కుమార్తెను చూడడానికి గోవర్షిని వచ్చింది.
ఈ సమయంలో రామారావు తన భార్యను పట్టుకొని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. అయితే, భర్తతో ఉండడానికి ఆమె నిరాకరించింది. దీంతో శుక్రవారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో ఇంటి బయట ఆవరణలో గోవర్షిని నిద్రిస్తుండగా, రామారావు గొడ్డలితో ఆమె తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమా లేక వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.