గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం.. టిజిపిఎస్సిపై సుప్రీంకోర్టుకు కవిత లేఖ
గ్రూప్-1 నియామకాల్లో టిజిపిఎస్సి 371డి ఆర్టికల్ను తుంగలో తొక్కింది
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసింది
సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకోని సుమోటోగా విచారణ చేపట్టాలి
సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టిజిపిఎస్సి రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సిజెఐకి కవిత లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులైన 371-డి ఆర్టికల్కు విరుద్దంగా నియామకాలు జరిపినట్లు ఎంతో మంది అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను ఆమె కోరారు. మా ఉద్యోగాలు మాకే అంటూ తెలంగాణ ఉద్యమం జరిగిందని…ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వు ఆర్టికల్ 371-డి ని సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 371-డి ప్రకారం ఇక్కడి ప్రాంత వాసులకే ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. కానీ, తెలంగాణ సాధించుకున్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్ -1 నియామకాల్లో ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించటమే కాకుండా టిజిపిఎస్సి చాలా తప్పులకు పాల్పడిందని సిజెఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ కారణంగా స్థానిక తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిజిపిఎస్సి తన చర్యతో అటు రాజ్యాంగంపై ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందని అన్నారు. ఈ అంశంపై అభ్యర్థుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చినప్పటికీ టిజిపిఎస్సి పట్టించుకోకపోవటం కచ్చితంగా రాజ్యాంగాన్ని అవమానించటమేనని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థుల్లో రాజ్యాంగంపై, నాయ్యవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకులైన మీరు జోక్యం చేసుకోవటం ద్వారానే తెలంగాణలో అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయి రాసిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 371డి ఉల్లంఘనకు పాల్పడిన టిజిపిఎస్సి వ్యవహారాన్ని సుమోటోగా విచారణ జరపాలని కోరారు. ఈ మొత్తం అంశాన్ని విచారించి అవకతవకలు జరిగినట్లు తేలితే గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టిజిపిఎస్సి చేపట్టిన గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని సిజెఐకి కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.