మన తెలంగాణ / హైదరాబాద్ : పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ్ రాశారు. రాష్ట్రంలో మార్చి 2024 నుండి పదవీ విరమణ పొంది ఇప్పిటికీ 18 నెలలు గడిస్తున్నాయని, నాటి నుండి నేటి వరకు పదవీ విరమణ పొందిన వారు సుమారు 12 వేల మంది ఉన్నారని, వారికి ఇప్పటి వరకు ఎటువంటి పదవీ విరమణ బకాయిలు అందలేదని ఆయన సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, వారు కుటుంబ బాధ్యతలు తీర్చలేని పరిస్థితిలోకి నెట్టబడ్డారన్నారు.
బకాయిలు విడుదల చేయకపోవడంతో మానసిక ఆందోళనలు తట్టుకోలేక రాష్ట్రంలో కొన్ని మరణాలు కూడా సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మండల పంచాయితి అధికారి, పి. సీతారామ రాజు అశ్వరావుపేటలో పదవీ విరమణ పొంది మానసిక వేదనతో గత నెలలో మరణించారని, రాష్ట్ర వ్యాపితంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వృద్ధాప్యంలో వారికి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. కావున పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కూనంనేని సిఎంకు విజ్ఞప్తి చేశారు.