సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ తన పుట్టినరోజు(అక్టోబర్ 23) సందర్భంగా నూతన ప్రయాణం మొదలుపెట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. 3 విజయవంతమైన సినిమాలను నిర్మించి సతీష్.. త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన తను నిర్మాతగా ప్రారంభమై సినిమా నిర్మాణానికి అన్నీ నేర్చుకుని పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అలాగే తన బ్యానర్లో ఇంకో రెండు సినిమాలు తీస్తున్నట్లు తెలిపారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నామని, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పారు. నార్నె నితిన్ హీరోగా ఉగాది రోజున ప్రారంభమైన సినిమా అనుకోకుండా పట్టాలెక్కకపోవడంతో ఆ కథను సరికొత్తగా మార్చి త్వరలో సినిమా చేస్తున్నామని చెప్పారు. ఈ రెండు సినిమాల అప్డేట్స్ వచ్చే ఏడాదిలో ఇస్తామన్నారు.