హైదరాబాద్: భూమి మీద ఆధిపత్యం కోసం గతంలో యుద్ధాలు జరిగాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు మీ మీద తిరగబడే అవకాశం ఉందని అన్నారు. లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్ధులకు లైసెన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిల్పకళావేదికలో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కన్నతల్లి పై ఉన్న మమకారాన్నే తెలంగాణ ప్రజలు భూమిపై చూపించారని, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం.. కొంతమంది దొరలకు చుట్టంగా మారిందని విమర్శించారు. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారని, తమ గెలుపునకు అనేక కారణాలు ఉండొచ్చు..బిఆర్ఎస్ ఓటమికి ధరణి చట్టమే కారణం అని అన్నారు. అధికారంలోకి వస్తే.. ధరణి నుంచి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చామని, తమ ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని తొలగించి భూభారతి తెచ్చామని తెలియజేశారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని..ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని, ఒకవేళ పరీక్షలు పెట్టిన ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి అని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో టిజిపిఎస్సి పునరావాస కేంద్రంగా ఉండేదని, తమ ప్రభుత్వం రాగానే టిజిపిఎస్సిని ప్రక్షాళన చేశామని రేవంత్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తాము ఉద్యోగాలు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసు వేసి ఆపాలని చూశారని మండిపడ్డారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశామని, త్వరలో గ్రూప్- 3,4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని అన్నారు. దేశ జిడిపిలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉందని, జిడిపిలో తెలంగాణ వాటా త్వరలోనే 10 శాతానికి చేరాలని కోరారు. ఉద్యోగులు కష్టపడితేనే.. ప్రజలు సమస్యలు పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.