బిసి రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బిసిలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు విమర్శించారు. ఆ రెండు పార్టీలు బిసిలను అవమానిస్తున్నాయని అన్నారు.బిసి రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బిజెపి పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది… కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బిసి రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు..? అని ప్రశ్నించారు.. పార్లమెంట్లో బిజెపికి 240 మంది ఎంపిలు, కాంగ్రెస్కు 99 ఎంపిల బలం ఉందని, రిజర్వేషన్ల బిల్లు అడ్డుకునేది ఎవరు..? అని అడిగారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ బిసి గణన చేయలేదని, బిజెపి అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నదని పేర్కొన్నారు.
గడిచిన 35 ఏళ్లల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బిసిలు గుర్తుకు రాలేదని విమర్శించారు. కానీ, ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బిసిలపై కపట ప్రేమ నటిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన ఏకైక నేత కెసిఆర్ అని, రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు… బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని అన్నారు. ‘జితానీ ఆబాదీ ఉత్నా హక్’ అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ, ఎనిమిది మంది బిజెపి ఎంపిలు గానీ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని అడిగారు.
రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా బిసి రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, ఎలాంటి పోరాటానికైనా బిఆర్ఎస్ కలిసి వస్తుందని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బిసి రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలను హరీష్రావు డిమాండ్ చేశారు.