దీపావళికి ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పిఎల్ఆర్) స్కీం బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి 1.03 లక్షల రూపాయల బోనస్ ను చెల్లింపునకు సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయూత అందిస్తోందని పేర్కొన్నారు. దీపావళి బోనస్గా 400 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1.03 లక్షలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద 39,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 18న (శనివారం) కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ ,
ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరింత అంకితభవంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేయాలని లేదా ప్రభుత్వ పొదుపు సంస్థల్లో పొదుపు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి బోనస్ కేవలం కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. భూగర్భంలో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారికి రూ 1.03 లక్షల పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ దినాలు పని చేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 30 మస్టర్లు పూర్తి చేసిన వారు ఈ బోనస్ పొందడానికి అర్హులు.