విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది ఫేషియల్ రికగైజేషన్ తప్పనిసరి
వైద్యకళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం
విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
ఆహార నాణ్యత పరీక్షకు ప్రత్యేక యాప్
సకాలంలో యూనిఫామ్లు, పుస్తకాల పంపిణీ
ఖర్చులు, బకాయిలపై యాక్షన్ ప్లాన్
సంక్షేమ వసతి గృహాల సమీక్షలో సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: బిసి, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు , తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగించుకునే వెసులుబాటును కలిగించింది. హాస్టళ్లకు కేటాయించిన నిధుల చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందజేశారు.
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఐసిసిసిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన , బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపుకు ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. పూర్తి స్థాయి డేటా జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ను ఉపయోగించాలని సిఎం సూచించారు. విద్యార్థులకు విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని దాంతో వారికి లభించే క్యాలరీలను తెలుసుకోవాలని సిఎం ఆదేశించారు.
యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో…
హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్బోర్డులో అప్లోడ్ చేయాలని సిఎం ఆదేశించారు. హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానించాలని సిఎం సూచించారు. హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సిఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని సిఎం సూచించారు.
ఖర్చులు, బకాయిల చెల్లింపునకు అవసరమైన మొత్తానికి
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు స్కాలర్షిప్లు సిబ్బంది జీతాలు, డైట్ఛార్జీలు, నిర్మాణ ఖర్చులు, ఇతర ఖర్చులు, బకాయిల చెల్లింపు, హాస్టళ్ల నిర్వహణకు అయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపుకు అవసరమైన మొత్తానికి సంబంధించి కార్యాచరణను రూపొందించి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్లను ఆదేశించారు. హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్లైన్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎడ్ టెక్ను ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటికి అవసరమైన యాప్లను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షకు ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ హాస్టళ్లలోని పరిస్థితులపై ప్రజేంటేషన్ ఇచ్చారు. సమీక్షలో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల శాఖల అధికారులు జ్యోతి బుద్ధప్రకాష్ జ్యోతి , బి. షఫియుల్లా, అనితా రామచంద్రన్, క్షితిజ, నిర్మల క్రాంతి వెస్లీ, కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.