వర్షాలు తగ్గిన తరువాత వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలి
గత ఏడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైపాయిడ్ కేసులు
సమీక్షా సమావేశంలో ఆరోగశాఖ మంత్రి దామోద ర్ రాజనర్సింహ
మన తెలంగాణ/హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మొత్తంగా చూసినప్పుడు కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్, మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని, ఆయా జిల్లాల్లో యాంటిలార్వల్ ఆపరేషన్ను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని, ఆయా జిల్లాల్లోని హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ చికున్గున్యా కేసులు 361 నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. అదేవిధంగా గతేడాది 10,149 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు. ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలను మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఒకవేళ సీజనల్ వ్యాధుల బారినపడితే, ప్రభుత్వ దవాఖాన్ల వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.