జెరూసలెం : ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు బెంజమిన్ నెతన్యాహు సర్కారు ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ చట్టసభ కనేసేట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రపంచానికి ట్రంప్ లాంటివారు మరింత మంది కావాలని ఆకాంక్షించింది. వచ్చే ఏడాది ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తామని తెలిపింది. ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో కలిసి జెరూసలెంలోని చట్టసభకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ చట్టసభ్యులు అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు.
కాల్పుల ఒప్పందం చేసినందుకు గాను రెండున్నర నిమిషాలు పాటు లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్పీకర్ అమిర్ ఒహనా మాట్లాడుతూ బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్ను యూదు ప్రజలు వేల సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని కొనియాడారు. శాంతి స్థాపన కోసం ఆయన చేస్తున్నంతగా ఎవరూ చేయడం లేదని అన్నారు. దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న ట్రంప్ లాంటి నేతలు ప్రపంచానికి మరింతమంది కావాలని అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులు మరెవరూ లేరని తెలిపారు. వచ్చే ఏడాది నోబెల్ పురస్కారం కోసం అన్ని దేశాలూ ట్రంప్ పేరు ప్రతిపాదించేలా తాము కృషి చేస్తామన్నారు.
ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తి ట్రంప్
అనంతరం నెతన్యాహు ప్రసంగిస్తూ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచాన్ని ఇంత వేగంగా దృఢ నిశ్చయంతో కదిలించిన ట్రంప్ లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. యుద్ధం ముగిసేలా గాజా ఒప్పందం చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి స్థాపనకోసం తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
బహుమతిగా బంగారు పావురం
అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ కొంతసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు అపురూప కానుక ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ట్రంప్నకు బంగారు పావురాన్ని బహుమతిగా అందజేశారు.