ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుంది
రేవంత్రెడ్డి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపుతున్నారు
కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి
రెండేళ్లవుతున్నా ఇంకా కెసిఆర్నే నిందిస్తున్నారు
బిజెపి తెలంగాణకు పనికిరాని పార్టీ
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారని, కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.10 వేలు ఇస్తారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం షేక్పేట్ డివిజన్కు చెందిన బిజెపి సీనియర్ నేత చెర్క మహేష్, ఇతర నేతలు కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సి దాసోజు శ్రవణ్, ఎంఎల్ఎ ముఠా గోపాల్ మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్రెడ్డి,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా సిఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ ప్రతిదానికి కెసిఆర్నే నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సిఎం రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లడుతున్నారని విమర్శించారు.
పేదల ఇళ్లపై బుల్డోజర్ దాడి
హైదరాబాద్లో గరీబోళ్ల ఇళ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి.. ఆ ఇళ్లని సిఎం రేవంత్రెడ్డి కూలగొట్టిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ప్రజలకి కారు కావాలో.. బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదల ఇండ్లపైన కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లను నడిపిస్తున్నదని మండిపడ్డారు. అన్నీ తెలిసి కూడా బిసి రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని సిఎంకు తెలుసు అని పేర్కొన్నారు. ఇచ్చిన జిఒను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బిసి రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశాడని విమర్శించారు. అజారుద్దీన్కు ఇస్తామని చెప్పిన ఎంఎల్సి కూడా ఆయనకు రాదని తెలుసు అని, కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన స్మశానం విషయంలో కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
హైదరాబాద్ నగరం అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కెసిఆర్ తిరిగి రావాలని, అందుకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన మోసం గురించి కాంగ్రెస్ పార్టీపైన ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4 వేల పెన్షన్లు వస్తాయి.. మిగతా హామీలు అమలవుతాయని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు.
ఈ రెండేళ్లుగా ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. ఒక్క ఇల్లు కట్టలేదు.. ఒక్క ఇటుక పెట్టలేదు.. కానీ 2.30 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసిందని అన్నారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజం అని, ఆయన నిజాయితీగా చెబుతూ మరీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ముతారని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాని పార్టీ అని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మోరీలో వేసినట్లేనని కెటిఆర్ పేర్కొన్నారు.