మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరి కా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరు దేశాల మధ్య సంబంధాల ను మరింత పెంపొందించేలా ఉండాల ని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అమెరికాలోని హడ్సన్ ఇనిస్టిట్యూట్కు చెందిన వివిధ రంగాలకు చెందిన మే ధావులు, బిజినెస్ లీడర్లతో కూడిన16 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం భారత్లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఈ బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యింది. మంత్రి శ్రీధర్బాబు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు,
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సం జయ్ కుమార్, సిఎంఓ ముఖ్య కా ర్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయని ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని సిఎం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ భవిష్యత్ ప్రణాళికల గురించి సిఎం రేవంత్ వివరించారు.
పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు
పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుందని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా అందరినీ ఆకర్షిస్తోందని, దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని, మన మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ప్రపంచ ప్రమాణాలకు సవాల్గా ఉందని సిఎం అన్నారు. జీఎఎస్డిపి, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని,
2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లో గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు రీజనల్ రింగ్రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చర్ జోన్లు అభివృద్ధి చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఎపిలో మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు
హైదరాబాద్ నుంచి అటు చైన్నై వరకు, ఇటు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అభివృద్ధి చేస్తామని, సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త మార్గాలను తెరుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 30 వేల ఎకరాల్లో హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వానిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని, ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలన్న ఆకాంక్షను సిఎం రేవంత్ వ్యక్తం చేశారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఏఐ యూనివర్శిటీని ఏర్పాటు చేసే దిశగా
హైదరాబాద్లో ఏఐ సిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వివరించారు. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి అన్నారు. ఇప్పటికే పేరొందిన కంపెనీలు హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పాటు చేశాయని, వీటిని గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లో ప్రధాన వాటాను సరఫరా చేశాయని, స్వదేశీ కంపెనీలను మరింతగా పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నా యన్నారు. హడ్సన్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి, వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్, రేషనల్వేవ్ క్యాపిటల్ పార్టనర్స్ సిఈఓ మార్క్ రోసెన్బ్లాట్, క్రౌ హోల్డింగ్స్ చైర్మన్ హర్లాన్ క్రో, ఈగిల్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు రావెనెల్ కర్రీ, బిల్లింగ్సీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్సీతో పాటు మొత్తం 16 మంది అమెరికా ప్రతినిధి బృందంలో ఉన్నారు.