నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి ముగ్గురు బాలికలు తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెండవ టౌన్ ఎస్ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బిసి బాలిక వసతి గృహానికి చెందిన పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కనిపించకుండా పోయారని హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వసతి గృహంలోని సిసి కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.