మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సిఎం రేవంత్ రెడ్డితో మద్ధతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై చర్చించామన్నారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్ధతు ధర ప్రకటించినప్పటికి ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో ముఖ్యమంత్రి సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తుమ్మల ప్రకటించారు. గత సంవత్సరం కేంద్రం కేవలం మద్ధతు ధర ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వమే సుమారు రూ. 535 కోట్లతో రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ సీజన్ లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని మంత్రి పేర్కొన్నారు.
సెప్టెంబర్ 3 వ వారం నుండే మార్కెట్లోకి భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి క్వింటాకు రూ. 2,400 కన్నా రూ. 441 తక్కువగా రూ. 1,959 రూపాయలు ఉందని, దీని వలన మొక్క రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 8.66 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వంపై రూ. 2400 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికి రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతులు తమ ఉత్పత్తిని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలోని మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఈ మద్దతు ధర అవకాశాన్ని వినియోగించుకొవాలని మంత్రి కోరారు. తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేయకుండా, మార్క్ ఫెడ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రైస్ సపోర్ట్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేసే పెసర, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధించిందని, రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనగోలు చేయడానికి ఈ సీలింగ్ అడ్డంకిగా మారుతుందన్నారు. ఈ సీలింగ్ ను దాటి రైతులు పండించిన మొత్తం పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. మొక్కజొన్న, జొన్న లాంటి పంటలకు కేవలం మద్ధతు ధర ప్రకటనలకే పరిమితం కాకుండా ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్లైతే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదని మంత్రి వివరించారు.