మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందుల పదే పదే మీకు గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అని, పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సిన సిఎం పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం అని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, పంట కోతకు వచ్చి మక్కలను మార్కెట్లలోకి తరలిస్తున్నారని అన్నారు. దాదాపు అన్ని మార్కెట్ యార్డులు మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయని, కానీ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని చెప్పారు.
క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెల్లిస్తామన్న రూ.330 బోనస్ను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. క్వింటాల్ మక్కలను రూ.1600కే రైతుల వద్ద నుంచి ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారని, ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి వారి కష్టమంతా దళారుల పాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ టూర్లు, కమిషన్లు,సెటిల్మెంట్లు పక్కనబెట్టి రైతుల బాధలపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతుల ఏడుపు, అన్నదాతల ఆవేదన కంటే సిఎంకు కక్ష రాజకీయాలే ముఖ్యమా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్విoటాల్కు 2400 రూపాయలతోపాటు రూ. 330 రూపాయల బోనస్ లభించేలా చూడాలని హరీష్రావు బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.