హైదరాబాద్: సిఎం సొంత జిల్లా వికారాబాద్ లో జీతాలు రాకపోవడంతో ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గెస్ట్ లెక్చరర్స్ కు తొమ్మిది నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుందని, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని గెస్ట్ లెక్చరర్స్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారు? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో లెక్చరర్లే కాదు, విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం, ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుంది? అని ప్రశ్నించారు. సిఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చని చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి పరువు కాపాడుకోవాలని హరీష్ రావు సలహా ఇచ్చారు.